Powered By Blogger

Monday 29 June 2015

బాపు


బాపు గారింటికి రోజూ ఒకాయన వచ్చి మాటలతో ఆయన్ను విసిగించేవాడు. అందువల్ల బాపూకి ఎంతో విలువైన కాలం వృధా అయిపోయేది. ఓ రోజు సాయంత్రం ఆ వ్యక్తి వచ్చి, "నిన్న నేను ఇక్కడకు వచ్చానుగాని, మీ దగ్గరికి రాలేకపోయాను" అన్నాడు నొచ్చుకుంటూ.

"థాంక్స్!" అన్నారు బాపు ముక్తసరిగా.

అప్పటినుండి ఆ వ్యక్తి బాపు ఇంటికి రావడం మానేశాడు.
(సేకరణ ః 1993 ఆంధ్రజ్యోతి దీపావళి ప్రత్యేక సంచికనుండి)

Tuesday 23 June 2015

మామ - అప్పూ


మామ – అప్పూ
………………..
బాపు రమణలకు రచయితగా ఆరుద్ర గారితో ఎంత సాన్నిహిత్యం ఉందో, సంగీత దర్శకుడిగా కె.వి.మహాదేవన్ గారితో అంతే సాన్నిహిత్యం ఉంది. మహాదేవన్ గారు జీవించి ఉన్నంత కాలం, ఒకటి, రెండు సినిమాలు తప్ప బాపు రమణలకు మహదేవన్ గారే సంగీత దర్శకులు. బాపు రమణల తొలి చిత్రం “ సాక్షి” చిత్రంతో ప్రారంభం అయిన వారి ప్రయాణం, మహాదేవన్ గారు చేసిన “శ్రీనాధ కవిసార్వబౌమ” వరకు సాగింది. తెలుగు వాడు కాకపోయినా, తెలుగు వారి జానపద, సంప్రదాయ సంగీత రీతులను ఒడిసి పట్టుకున్న మహాదెవన్ అంటే బాపు రమణలకు అత్యంత అభిమానం. సినిమా రంగంలో “మామ” అని అందరూ ఆప్యాయంగా పిలుచుకొనే మహాదేవన్, బాపు రమణల సాక్షి, బుద్ధిమంతుడు, బాలరాజు కధ, సంపూర్ణ రామాయణం, ముత్యాల ముగ్గు, గోరంతదీపం, పెళ్ళిపుస్తకం మొదలైన చిత్రాలకు అత్యంత మధురమైన సంగీతం అందింఛారు. సంపూర్ణ రామాయణంలో శబరి పాత్ర పై చిత్రీకరించిన "ఎందుకో కొలను నీరు ఉలికి ఉలికి పడుతోందీ" వంటి పాటలను ఎవరు మరువగలరు?
..
మహాదేవన్ గారి సహాయకులు శ్రీ పుహళేంది గారు. ఈయనిని అందరూ “అప్పూ” అని పిలిచే వారు. మళయళీ అయినా తెలుగు బాగా తెలిసిన వాడు. తెలుగు పాటలోని అర్థాన్ని మహాదేవన్ గారికి వివరించి చెప్పేవారు. మహాదేవన్ ట్యూన కట్టగానే హార్మోనియం మీద వాయించో, లేక పాడో గాయనీ గాయకులకు వినిపించేవారు.
..
వారిద్దరి మీద అభిమానంతో బాపు గారు గీసుకున్న బొమ్మ ఇది.


(courtesy : Umamaheswar Rao Ponnada)

Thursday 18 June 2015

విప్లవ వాల్మీకి ఆరుద్ర


విప్లవ వాల్మీకి

బాపు-రమణలకు, ఆరుద్ర అంటే ప్రత్యేకమైన అభిమానం. ఆరుద్ర జీవించినంత కాలం బాపు రమణల సినిమాలలో ఆరుద్ర పాట లేకుండా ఒక్క సినిమా కూడా తీయలేదు. ఆరుద్ర నాస్తికుడు, కమ్యూనిష్టు భావజాలం కలవాడు. అయినా ఆరుద్ర శ్రీ రాముని మీద అధ్భుతమైన పాటలు, పద్యాలు వ్రాసారు. “సంపూర్ణ రామాయణం” సినిమా తీస్తున్నప్పుడు “ఒకడు కార్టూనిష్టు, మరొకడు హ్యూమరిస్టు, ఇంకో ఆయన కమ్యూనిష్టు. ఈ సినిమా ఫ్లాప్ అవడం ఖాయం” అని అందరూ గేలి చేశారుట. కానీ ఆ సినిమా అఖండ విజయం సాధించింది. దానికి కారణం ఆరుద్రే ! “ వెడలెను కోదండ పాణి” వంటి సుదీర్ఘ కధా కధనంతో పాటు, సరళ మైన సంభాషణలు, గుహుని పాత్ర పై వ్రాసిన “రామయ్య తండ్రీ” వంటి పాటలు ఆ సినిమాకు అఖండ విజయాన్ని అందించాయి. శ్రీ రామాంజనేయ యుధ్ధం సినిమాలో “శ్రికరమౌ శ్రీ రామ నామం” పాటలో శ్రీ రాముడిని వివిధ కోణాలలో ఆరుద్ర వర్ణించిన విధానం బాపు రమణలకు ఎంతగానో నచ్చిందట. ఇక ఆరుద్ర వ్రాసిన “రాయినైనా కాక పోతిని” ప్రైవేటు గీతం విని, బాపు రమణలు ముగ్ధులైపోయి, గ్రామఫోన్ కంపెనీ వారి వద్ద ఆ గీతం హక్కులు తీసుకొని., తమ “గోరంత దీపం” చిత్రంలో పెట్టుకున్నారు. మరొక కవి సి. నారాయణ రెడ్డి ఆ పాట విని “జీవిత కాలంలో ఇలాంటి పాట ఒక్కటి వ్రాస్తే చాలు, జన్మ ధన్యం అయిపోతుంది” అని మెచ్చుకున్నారు. “సీతా కళ్యాణం” సినిమాలో “సీతమ్మకు సింగారము చేతుము రారమ్మ” బాపు రమణల సినినమాకు ఆరుద్ర వ్రాసిన గొప్ప పాటలలో ఒకటీ. ఆరుద్ర చివరి రోజులలో అనారోగ్యంతో ఉన్నా, బాపు రమణల “శ్రీ భాగవతం” టీ.వి, సీరియల్ కోసం సుందరకాండని అరవై నిముషాల పాటగా ఇచ్చి ఆ సీరియల్ నిర్మాణం పూర్తికాకముందే నిష్క్రమించారు.. ముళ్ళపూడి చెప్పినట్లు ఆరుద్ర అక్షర శరీరుడు, పరిశోధనా పరమేశ్వరుడు. నాస్తికుడైనా, శ్రీ రామ తత్వాన్ని సంపూర్ణంగా అవగాహన చేసుకున్న ఆరుద్ర వాళ్ళిద్దరి దృష్టిలో “విప్లవ వాల్మీకి”.

(courtesy : Umamaheswara Rao Ponnada garu)

Sunday 14 June 2015

బుచ్చిబాబు


ప్రముఖ రచయిత బుచ్చిబాబు (శివరాజు వెంకట సుబ్బారావు) జయంతి నేడు. 1916 June 14న జన్మించిన బుచ్చిబాబుకి ఇది శత జయంతి సంవత్సరం . 
బుచ్చిబాబు అంటే అందరికీ తెలియక పోవచ్చు. కానీ చివరకు మిగెలేది అంటే బుచ్చిబాబు నిస్సందేహంగా గుర్తుకొస్తాడు. బెంగాలీ సాహిత్యమే సాహిత్యం అని ప్రచారం జరుగుతున్న రోజుల్లో, స్వంత ఆలోచనలతో, అభ్యుదయ భావాలతో, మనస్తత్వ విశ్లేషణలతో తెలుగు సాహిత్యాన్ని కుదెపేసిన అడవి బాపిరాజు, చలం, కొడవటిగంటి, గోపిచంద్ వంటి వారి సరసన చేర్చదగ్గ వ్యక్తి బుచ్చిబాబు. 1945-67ల మధ్య ఆకాశవాణిలో పనిచేసారు.
ఆంగ్ల సాహిత్యంలో M.A. చేసిన బుచ్చిబాబుపై బెర్ట్రాండ్ రస్సెల్ ప్రభావం కొంత వరకూ పడినా, లోతైన ఆలోచనలతో, చైతైన్య స్రవంతి (Stream of consciousness) ప్రక్రియతో తనదైన స్వంత గొంతుకని వినిపించాడు ఆయన.
కధకునిగా - మేడమేట్లు, నన్ను గురించి కధ వ్రాయవూ?, కలలో జారిన కన్నీరు, తడిమంటకు పొడినీళ్ళు వంటి విశిష్టమైన 82 కధలను వ్రాసారు.
ఆయన వ్రాసిన ఏకైక నవల “చివరకు మిగిలేది”. 1946-47లో నవోదయ పత్రికలో సీరియల్ గా వచ్చి తెలుగు సాహిత్యంలో అజరామరంగా (All time classic) నిలిచిపోయింది. 1952లో నవల రూపంలో ప్రచురింపబడి, ఆ తరువాతి మలిముద్రణలలో సహితం బెస్ట్ సెల్లర్ గా నిలిచింది. 
నాటక రచయితగా బుచ్చిబాబు అనేక రేడియో నాటికలు వ్రాసారు. ఆయన వ్రాసిన “ఆత్మవంచన” నాటిక రేడియోలో వచ్చింది. అందులో సావిత్రి, పుండరీకాక్షయ్య వంటి వారు నటించేవారు. తెలుగు సినీ కళాఖండం “మల్లీశ్వరి” సినిమాకు బుచ్చిబాబు వ్రాసిన “కృష్ణదేవరాయల కరుణ కృత్యం” నాటిక ఆధారం. ఆత్మవంచన నాటిక 1955లో ఆంధ్ర కళాపరిషత్ వారు కాకినాడలో ప్రదర్శించినప్పుడు, ఉత్తమ ప్రదర్శనగా ఎన్నికై, హిందీ నటుడు పృథ్వీరాజ్ కపూర్ చేతుల మీదుగా అవార్డు అందుకున్నారు.
వ్యాసకర్తగా – నన్ను మార్చిన పుస్తకం, నేను-శంకరనారాయణ నిఘంటువు వంటి రచనలు చేసారు. షేక్స్ పియర్ రచనల మీద “షేక్స్ పియర్ సాహితీ పరామర్శ” పరిశోధనకి గాను సాహిత్య ఎకాడమీ అవార్డు అందుకున్నారు.
చిత్రకారునిగా కూడా ప్రతిభ కలవారు బుచ్చిబాబు. ఆయన 1940-60ల మధ్య దక్షిణభారత దేశాన్ని తన పెయింటీంగ్సులో, ల్యాండ్ స్కేప్ లలో చిత్రీకరించారు. 1955లో ఆకాశవాణి, విజయవాడ ప్రాంగణంలో ఆయన చిత్ర ప్రదర్శన కూడా జరిగింది. 
1967 లో 51 ఏళ్ళ పిన్న వయస్సుకే జీవితం చాలించిన బుచ్చిబాబు, తెలుగు సాహిత్యంలో ఒక మహోజ్వల తార. పాలగుమ్మి పద్మరాజు శతజయింతిని విస్మరించిన మన ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం, బుచ్చిబాబు శత జయంతిని అధికారికంగా నిర్వహిస్తే బాగుంటుంది

(courtesy : Umamaheswara Rao Ponnada).

బుచ్చెమ్మ - గురజాడ వరి 'కన్యాశుల్కం' నాటకం లో ఓ పాత్ర - ప్రేరణ : BAPU


గురజాడ వారి కన్యాశుల్కం లో 'బుచ్చెమ్మ పాత్ర కి నా బొమ్మ - ప్రేరణ స్వర్గీయ 'బాపు'